ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:45 PM
ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లిటౌన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఏ.శ్యామల సర్వే నెంబర్ 12/ఆ/2 47 ఆ/5లో భూమి ఉండేదని, భర్త మరణించినందున ఆ భూమి తన పేరు మీద విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకోగా ఆర్డీవో, తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి మండలం పెద్దకలువల గ్రామానికి చెందిన నారసాని వెంకటేష్ గ్రామంలో తనకు మీసేవ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులకు రాశారు. ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన తిరుపతి గ్రామంలో అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశారని, ప్రభుత్వ ఉద్యోగులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి రేషన్ కార్డు రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ-నామ్ 2.0 అమలుకు రైతులు సహకరించాలి
పెద్దపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఈ-నామ్ 2.0 అమలుకు రైతులు సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులకు పారదర్శకమైన పోటీ ధరలు అందించడానికి ఈ-నామ్ వ్యవస్థ అమల్లో ఉందని, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా ఈ-నామ్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ-నామ్ 1.0 నుంచి 2.0కి మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ-నామ్ 2.0 అమలు తప్పనిసరి అని, ఈ కొత్త వ్యవస్థ ద్వారా రైతులకు మరింత పారదర్శకంగా మెరుగైన పోటీ ధరలు లభిస్తాయన్నారు. రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి ముందు పూర్తి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఎల్ఓటీ ఐడి పొందాలని సూచించారు. అలాగే కమీషన్ ఏజెంట్, ట్రేడర్లు కూడా ఈ-నామ్ 2.0 మార్పిడి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ సిబ్బంది, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.