బైపాస్ రోడ్డుతో ప్రజలకు ఉపయోగం లేదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:16 AM
పట్టణ శివారులో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు, బ్రిడ్జితో మంథని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. పట్టణ శివారులో నిర్మించనున్న బైపాస్ రోడ్డు స్థలాన్ని మంగళవారం సందర్శించారు.
మంథని, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు, బ్రిడ్జితో మంథని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. పట్టణ శివారులో నిర్మించనున్న బైపాస్ రోడ్డు స్థలాన్ని మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బంధువు భూములకు విలువ రావాలనే, రియల్ ఎస్టేట్ చేసుకునేందుకే బైపాస్ రోడ్డుకు శ్రీకారం చుట్టారన్నారు. బైపాస్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రెండేళ్ళ క్రితమే జీవో వచ్చిన ఇప్పటి వరకు భూసేకరణకు డబ్బులు రాలేదన్నారు. రోడ్డు నిర్మాణంలో 137 మందికి చెందిన 80 ఎకరాల భూమి కోల్పోయి వారు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భూములకు నాలా కన్వర్షన్ చేస్తున్న అధికారులకు స్థానిక రైతులకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇందులో ల్యాండ్ మాఫియా ఉందన్నారు. బోయినిపేట, గొల్లగూడెం మీదుగా రింగ్ రోడ్డు నిర్మాస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏగోళపు శంకర్గౌడ్, తగరం శంకర్లాల్, పుప్పాల తిరుపతి, కనవేన శ్రీనివాస్, జంజర్ల శేఖర్, కాయితీ సమ్మయ్య, పిల్లి సత్తయ్యలు పాల్గొన్నారు.