శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలు అమలుచేయాలి
ABN , Publish Date - May 25 , 2026 | 12:07 AM
ప్రభుత్వం సవరించిన వేతనాలను పునఃపరిశీలన చేసి శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం నిర్ణయించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఐఎఫ్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం యూనియన్ ఆఫీస్లో జరిగింది. ఈసందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు.
గోదావరిఖని, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సవరించిన వేతనాలను పునఃపరిశీలన చేసి శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం నిర్ణయించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఐఎఫ్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం యూనియన్ ఆఫీస్లో జరిగింది. ఈసందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు. సుమారు దశాబ్దన్నర కాలంగా కనీస వేతనల సవరింపునకు ఎదురుచూస్తున్న కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ మిగిల్చినట్టు తెలిపారు. కార్మికులకు ఇస్తున్న వేతనాల్లో కోత విధించే పరిస్థితి ఏర్పడినట్టు తెలిపారు. రెండేళ్లుగా కనీస వేతనాలను సవరించాలని వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నట్టు కృష్ణ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కనీస వేతనాలను సవరించి అమలు చేసినట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించినా, జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా సవరణ ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మూడు జోన్లుగా విభజించి వేర్వేరుగా వేతనాలను ప్రకటించడం దుర్మార్గమైన చర్య అన్నారు. జోనల్ విధానాన్ని రద్దు చేయాలని కృష్ణ డిమాండ్ చేశారు. వేతనాలను నాలుగు కేటగిరీలుగా విభజించి అన్ని రంగాలలో ఒకే విధంగా వేతనాలు పెంచడం వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కనీస వేతనాన్ని 26,000 ఉండేలా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం పెద్దగా వేతనాలు పెరిగే అవకాశం లేదన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్, నాయకులు బీ అశోక్, చిలుక శంకర్, రామకృష్ణ, దుర్గయ్య, రాజేశం పాల్గొన్నారు.