Share News

సభను జయప్రదం చేయండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:47 PM

సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడవెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ నుంచి ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

 సభను జయప్రదం చేయండి

పెద్దపల్లి టౌన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడవెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ నుంచి ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిరి ఫంక్షన్‌ హాల్లో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్‌ హాజరై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు బహిరంగ సభ ఈనెల 18న ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలోని పార్టీ, ప్రజా సంఘాలు ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రతీ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర ప్రధానంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పేరును వీబీజీరామ్‌జీగా మార్చి చట్టం చేశారన్నారు. గతంలో 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉంటే నేడు దాన్ని 60 శాతానికి కుదించి మిగతా 40 శాతం రాష్ట్రమే భరించుకునే విధంగా చట్టాన్ని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ 44 చట్టాలు ఉంటే నాలుగు కోట్లుగా విభజించి దుర్మార్గపు పాలన చేస్తున్న మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేస్తూ ఆదివాసీలను సైతం చంపుతున్నారన్నారు. దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని, అనంతరం అర్బన్‌ నక్సల్స్‌ అంతం చేస్తామని బహిరంగంగా ప్రకటించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్‌ గోవర్ధన్‌, గోసిక మోహన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కె కనకరాజు, తాళ్లపల్లి మల్లయ్య ,కడారి సునీల్‌, మడ్డి ఎల్లయ్య, మార్కపురి సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పూసాల రమేష్‌, బాలసాని లెనిన్‌, రేణిగుంట్ల ప్రీతం, ఆరేపల్లి మానస్‌, కల్లేపల్లి నవీన్‌, కన్నం లక్ష్మీనారాయణ, మాటేటి శంకర్‌,శనిగరపు చంద్రశేఖర్‌, రాజారత్నం, ఆసాల రమ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:47 PM