అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:39 PM
మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీమోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
మంథని, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీమోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. చెరువు పునర్నిర్మాణ పనులను వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనుల్లో కనీసం 50 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దర్యాపూర్ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి కావాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం దర్యాపూర్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దర్యాపూర్ మోడల్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ మంజూరైన పనులను వేగవంతం చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అదనంగా నిధులు అవసరమైతే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అంచనాలు అందిన వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యత లేని పనులను సహించేది లేదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.