ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
ABN , Publish Date - May 07 , 2026 | 11:44 PM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో గురువారం అలైడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం మొదటి షిప్టులో యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో కార్మికులు మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. స్థానికులకే ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
కోల్సిటీ, మే 7(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో గురువారం అలైడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం మొదటి షిప్టులో యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో కార్మికులు మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. స్థానికులకే ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. బెంగాల్, బీహార్కు చెందిన పలువురు లోడింగ్ కార్మికులను వెనక్కి పంపారు. ఈ ఆందోళనకు ప్రభావిత ప్రాంతాల నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్లో కార్మికుల వాటా 12శాతమే ఉండాల్సి ఉండగా 25శాతం రికవరీ చేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా కార్మికులను తొలగించే విధానాన్ని మానుకోవాలని, ఆపరేటర్లకు పని భారం తగ్గించాలన్నారు.
ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని, టౌన్షిప్లోని పాఠశాలలో కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐకి సంబంధించి హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని, స్కిల్డ్ కార్మికులకు ఈఎస్ఐ వర్తింప చేయాలన్నారు. యూరియా, అమ్మోనియా గ్యాస్ అలవెన్సును 17.44శాతానికి పెంచాలని, మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. వినియోగంలో లేని ఏ టైపు క్వార్టర్లను కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్కడే వంట వార్పు చేశారు. ఎన్టీపీసీ పోలీసులు బందోస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు కొక్కిరాల శ్రీనివాస్, కందుల సతీష్, కన్నూరి శంకర్, రాజ్కుమార్, ఎరుకల అంజి, దబ్బెట మల్లేష్, రాజిరెడ్డి, తదితరులు మద్దతు తెలిపారు.