మండుతున్న కూరగాయలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:41 AM
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
జగిత్యాల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం కూరగాయల మార్కెట్లో కూరగాయలు ధరలు పైపైకి వెళ్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కిలో చొప్పున కొనుగోలు చేసిన కూరగాయాలను ప్రస్తుతం అర కిలో కొనడానికి ప్రజలు నిరాసక్తి కనబరుస్తున్నారు. దీంతో విక్రయదారులకు సైతం గిరాకీలు లేక నిరాశలో ఉంటున్నారు.
ఫమార్కెట్లో ధరలు
జిల్లాలో కిలో కూరగాయలు కొనాలంటే యాభై నుంచి వంద రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి నుంచి పాలకూర వరకు, ఉల్లిపాయల నుంచి ఎల్లిపాయల వరకు ఇలా ఏ కూరగాయలు కొనాలన్నా జేబులు గుల్లా చేసుకోవాల్సిందే. మొన్నటి వరకు కిలో టమాట రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60కి పెరిగింది. చింతపండు పాత ధర రూ.90, కొత్త ధర రూ.120, క్యాప్సికం(దొడ్డుమిర్చి) పాతది రూ.60, కొత్త ధర రూ.80, బీరకాయ పాతది రూ.60, కొత్త ధర రూ.80, క్యారెట్ పాతది రూ.60, కొత్త ధర రూ.80, దొండకాయ పాతది రూ.40 ఉండగా కొత్త ధర రూ. 60, వెల్లుల్లి పాతది రూ.90, కొత్త ధర రూ.120, ఉల్లిగడ్డ పాత ధర రూ.30, కొత్తది రూ.40, ఆలుగడ్డ పాతది రూ.30, కొత్త ధర రూ.40, చిక్కుడు పాత ధర రూ.80, కొత్త ధర రూ. 100లు, పచ్చిమిర్చి పాత ధర రూ.60 ఉండగా కొత్త ధర రూ.80, వంకాయ పాతది రూ.40 ఉండగా కొత్త ధర రూ.70 చొప్పున ధరలు మండిపోతున్నాయి. ఇవి కాకుండా బెండకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.40, మునగకాయ రూ.80, సోరకాయ ఒక్కంటికి రూ.20లు, పాలకూర రూ.40లు, బీట్రూట్ రూ. 50లు, తోటకూర రూ.30, చుక్క కూర రూ. 40, అల్లం రూ.100, బీన్స్ రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు.
ఫఇతర ప్రాంతాల నుంచి తెచ్చి..
జిల్లాలోని మార్కెట్లకు ఇతర ప్రాంతాల నుంచి పలువురు హోల్సెల్ వ్యాపారులు కూరగాయలు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలు కూరగాయలను ప్రతీ నిత్యం తీసుకువస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడం, సాగు నీటి వసతి, ఇతర కారణాల వల్ల కూరగాయలను పండించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతి కూర తదితర ఆకుకూరలు బోరు మోటార్ల నుంచి నీరు అందక ఎండిపోతున్నాయని అంటున్నారు. దీంతో ఆకు కూరలు మార్కెట్ రాక ధరలు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు.
ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు
-అడిగొప్పుల రజిని, గృహిణి, మెట్పల్లి
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండడం లేదు. నెల రోజులకు ఇప్పటికీ ధరలు విపరీతంగా పెరిగాయి.