ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:40 PM
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు పేదలకు అందించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.
పెద్దపల్లి టౌన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు పేదలకు అందించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆస్పత్రి వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వివిధ వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లలో 2,081 ఆర్థో సర్జరీలు, 6,478 జనరల్ సర్జరీలు, 3,096 కంటి శుక్లాల ఆపరేషన్లు, 5,067 ప్రసవాలు నిర్వహించినట్లు తెలిపారు. 40,923 యూఎస్జీ స్కానింగ్లు, 32,038 ఈసీజీలు తదితర వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఎస్ఎన్సీయూ ద్వారా 990 మంది నవజాత శిశువులకు సేవలు అందించామని చెప్పారు. ఆసుపత్రికి సుమారు రూ. 40 లక్షలతో అత్యాధునిక వైద్య పరికరాలు, రూ.20 లక్షలతో అంబులెన్స్ సమకూర్చినట్లు తెలిపారు. ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు ఆధునికీకరించేందుకు రూ. 52 కోట్లు మంజూరయ్యాయని, పనులు పూర్తిచేసి వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఆసు పత్రి మెరుగైన సేవలందించే స్థాయికి రావడానికి వైద్యులు, సిబ్బంది కృషి అభినందనీయమని, కలెక్టర్ కోయ శ్రీహర్షకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయరమణారావు కోరారు. జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అంతటి అంతయ్య, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు మినుపాల ప్రకాశ్ రావు, మల్లారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కె శ్రీధర్, కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, పార్టీ నాయకులు బూతగడ్డ సంపత్, పాల్గొన్నారు.