కారుతో బీభత్సం సృష్టించిన మైనర్.. చితకబాదిన స్థానికులు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:50 PM
హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో కారుతో ఓ మైనర్ బీభత్సం సృష్టించాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. వరుసగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టి విధ్వంసం చేశాడు.
హైదరాబాద్: బోరబండ ప్రాంతం కార్మికనగర్లో కారుతో ఓ మైనర్ బీభత్సం సృష్టించాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. వరుసగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టి విధ్వంసం చేశాడు. అలీ అహ్మద్ ఖాన్ (17) ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం కార్మికనగర్ ప్రాంతానికి కారులో వచ్చాడు. ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న సోదరులు రాజ్కుమార్ (60), ప్రభాకర్ (55) ప్రమాదాన్ని గమనించి తమ బైక్ను రోడ్డుపక్కకు తీసుకెళ్లారు.
అయితే, వారివైపే దూసుకొచ్చిన కారు ఏకంగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో పాటు అన్నదమ్ములపైకీ దూసుకెళ్లింది. కారు ఢీకొనడంతో ఇద్దరిలో ఒకరు స్వల్పగాయాలతో బయటపడగా.. మరొకరు దూరంగా ఎగిరిపడ్డారు. అనంతరం అతని పైనుంచి కారు వెళ్లగా.. వెనుక చక్రం వృద్ధుడి ఛాతిపై ఆగింది. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వారంతా పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద కారును పైకి ఎత్తి వాహనం కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. ప్రమాదం అనంతరం తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాలుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఘటనాస్థలానికి తీసుకొచ్చి అతడిపై దాడి చేశారు. మైనర్కి మద్దతుగా నిలిచిన మరో వ్యక్తినీ తీవ్రంగా కొట్టారు.
అనంతరం బాధితులిద్దరినీ వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును శుభ్రం చేసిన తర్వాత అందులోనే తాళాలు ఉండటంతో డ్రైవ్ చేసేందుకు బాలుడు తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం