మహిళా రిజర్వేషన్ బిల్లు నిజాయితీగా తీసుకురాలేదు: సీఎం రేవంత్..
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:56 PM
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిజాయితీగా తీసుకురాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు.
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిజాయితీగా తీసుకురాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని.. దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని లోక్ సభ సాక్షిగా అడ్డుకున్నామని పేర్కొన్నారు. విపక్షాల ఐక్యతతో మోదీ సర్కార్ ఓడిపోయిందన్నారు రేవంత్. ఇది రాజకీయ ఓటమి కాదని, బీజేపీ విధానాల ఓటమి అంటూ వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పాసైందని.. చిన్న సవరణలతో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రేవంత్ అన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకే బీజేపీ కుట్ర చేసిందని.. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారని తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాలపై బురదజల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని బీజేపీకి సూచించారు. అలా చేస్తే ఇండి కూటమి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించి తీసుకువచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉందని, యూపీ ఎన్నికల్లోపు వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. దీంతో ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బిల్లును అడ్డుకోకుంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవారని ధ్వజమెత్తారు. నార్త్, సౌత్ మధ్య అంతరాలు పెట్టే విధానం ఇకనైనా మార్చుకోవాలని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి హితవుపలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏప్రిల్లో మరింత ఎండలు.. రాత్రిపూటా తగ్గని ఉష్ణోగ్రతలు
ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు..