అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:16 PM
అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చలో బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమరావతికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం అని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు రుణాలతో కాలేశ్వరం కట్టామని వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాలేశ్వరం నిర్మించామని చెప్పుకొచ్చారు. కాలేళ్వరంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలోనే కేసీఆర్ మద్దతు: ఎంపీ సురేశ్
అంతకుముందు ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతికి గతంలోనే కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణను నెంబర్వన్గా నిలబెట్టామన్నారు. ప్రాంతాల వారీగా వేరైనా అన్నదమ్ముల్లా కలిసుందామని కేసీఆర్ అన్నారని వెల్లడించారు. కనీసం చర్చ లేకుండా 7 మండలాలను ఏపీలో కలిపారని.. విభజన తీరుపై బీజేపీ తరచూ విమర్శలు చేస్తోందని అన్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నట్లు మాట్లాడారని సురేశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కాలేశ్వరం అంటే ఒక డ్యాం.. ప్రాజెక్ట్ మాత్రమే కాదని ఎంపీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం అని తెలిపారు. పైసా ఇవ్వకపోయినా కాలేశ్వరం కట్టామన్నారు. అయినా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ రూ.లక్ష కోట్లు పోయాయని మాట్లాడారని చెప్పారు. సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని.. తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి పాటిల్ క్షమాపణ చెప్పాలని ఎంపీ సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రాజ్యసభలో బీఆర్ఎస్పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్
Read Latest Telangana News And Telugu News