కేసుల్లో సీఎం రేవంత్ టాప్..
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:06 AM
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ 3 స్థానాలను దక్కించుకున్నారు. ఇక.. కేసుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ 3 స్థానాలను దక్కించుకున్నారు. ఇక.. కేసుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఆయనపై ఏకంగా 89 కేసులున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన నివేదికను ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సోమవారం విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. 31 మంది సీఎంల ఆస్తుల మొత్తం విలువ రూ.3,660 కోట్లు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.1413 కోట్ల ఆస్తులతో సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.931 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం చంద్రబాబు రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్ రూ.648 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో 8వ స్థానంలో నిలిచారు. అతి తక్కువ ఆస్తులున్న వారిలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలతో మొదటిస్థానంలో, బెంగాల్ సీఎం సువేందు అధికారి రూ.85 లక్షలతో రెండో స్థానంలో, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ రూ.కోటితో మూడో స్థానంలో ఉన్నారు.
ఆస్తుల సంగతి పక్కన పెడితే.. మొత్తం 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇద్దరు సీఎంలపై హత్యాయత్నం కేసులున్నాయి. రేవంత్ తర్వాత అత్యధికంగా బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులున్నాయి. 19 కేసులతో ఈ జాబితాలో డీకే శివకుమార్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. 31 మంది సీఎంలలో 17 మంది 51-60 ఏళ్ల మధ్య వయసులో ఉండగా, 8 మంది 41-50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం రేవంత్రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: రాంచందర్రావు
ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ