Share News

Chaina Manza: మృత్యుపాశాలుగా మాంజాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:05 PM

నగరంలోని ఆయా ఏరియాల్లో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నారు. చెనా మాంజాపై నిషేధం ఉన్నా కొన్నిచోట్ల దుకాణాల వారు గుట్టుచప్పుడుకాకుండా విక్నయిస్తున్నారు.

Chaina Manza: మృత్యుపాశాలుగా మాంజాలు

- మార్కెట్‌లో విచ్చలవిడిగా నిషేధిత చైనా దారాలు

- పతంగులకు వినియోగిస్తున్న వైనం

- చిన్నారులతోపాటు వాహనదారులకు ప్రమాదం

- నవాబ్‌సాబ్‌కుంట ఘటన నిదర్శనం

- దుకాణదారులపై చర్యలేవి?

హైదరాబాద్: సంకాంత్రి పండుగ(Sankranthi Festival) అంటే గుర్తు వచ్చేది ముత్యాల ముగ్గులు, హరిదాసుల పాటలు, పండుగ సెలవులు. వీటికి తోడు అతి ముఖ్యంగా చెప్పుకోదగింది పతంగులు. అయితే మన గాలిపటంతో ఇతరులు ఎగురవేసే గాలిపటాన్ని తెగ్గోస్తే అదో సరదా. ఆ సరదా తీరాలంటే దానికి మాంజా కావాలి. సాధారణంగా మాంజా తయారీలో సీసం పౌడర్‌ను వినియోగిస్తారు. దీనివల్ల మనుషులకే కాక పశుపక్ష్యాదులకు కూడా ఎంతో ప్రమాదం. మాంజా ప్రమాదమని తెలిసినా సాధారణ మాంజానే కాక చైనా మాంజా(Chaina Manza)లను కూడా వాడుతుంటారు.


గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

ఈ మంజాలపై నిషేధం ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కొద్ది రోజులు హల్‌చల్‌ చేసే అధికారులు అది కాస్తా సద్దుమణగగానే ఆ విషయాన్ని గాలికి వదిలేస్తారు. దీనితో యధేచ్ఛగా మాంజాల విక్రయాలు జరుగుతున్నాయి. ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు వస్తుంది. ఈమఽధ్య కీసరలో మాంజా వల్ల ఓ యువకుడి గొంతు తెగిన ఘటన మరువక ముందే డిసెంబరు 29న నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన జమీల్‌ బైక్‌పై వెళుతుండగా శంషీర్‌గంజ్‌ వద్ద చైనా మాంజా అడ్డుపడటంతో అతడి గొంతును కోసేసింది.


మనల్ని మనం కాపాడుకోవాలి

ఇలాంటి మాంజాల వల్ల అనేకమంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుంటారు. ద్విచక్ర వాహనాల ముందు చిన్నారులను కూర్చోబెడుతుంటారు. ఇది మారీ ప్రమాదం. సంక్రాంతి సమీపిస్తుండడంతో పిల్లలు, పెద్దలు పోటాపోటీగా గాలిపటాలను ఎగురవేస్తుంటారు. దీనితో తెగిపోయిన మాంజా భవనాల మధ్య వేలాడుతుంటుంది. దీనిని గమనించకుండా వాహనదారులు వెళుతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అందువల్ల ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు మెడకు ఖర్చీఫ్‌ కట్టుకుని, తలపై హెల్మెట్‌ ధరించి ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


city9.2.jpg

పర్యావరణానికి ముప్పు

గాలిపటం ఎగురవేసేందుకు సీసం పౌడర్‌ వాడిన మాంజాను వాడుతుంటారు. దీనివల్ల గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) దేశవ్యాప్తంగా మాంజాలపై నిషేధాన్ని విధించింది. మాంజాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండడంతో గాజుసీసం పౌడర్‌తో తయారు చేసే చైనా మాంజా, కాటన్‌ మాంజా, నైలన్‌ మాంజాలను ఎన్‌జీటీ నిషేధించింది.


చైనా మాంజాలపై నిషేధం ఉంది

చైనా మాంజాలపై నిషేధం ఉంది. ఈ మాంజా చాలా పదునుగా ఉండడం వల్ల మెడలకు, ముఖాలకు తగిలితే తీవ్ర గాయాలు చేసి ప్రాణాలు తీస్తుంది. వీటి వల్ల పక్షులు వీటికి చిక్కుకుని తీవ్రంగా గాయపడి చనిపోతాయి. చైనీస్‌ మాంజా అంటే నైలాన్‌, సింథటిక్‌, గాజు పూత పూసిన దారం. దీనిపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పతంగులను కాటన్‌ దారలతోనే ఎగురవేయాలి.

రమేష్‌ గౌడ్‌, మహంకాళి పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌


చర్యలు తీసుకోవాలి

అధికారులు మాంజా తయారీ కేంద్రాలు, ప్రదేశాలను తనిఖీ చేసి మాంజాను తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మాం జాలు అమ్మే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాంజాను ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

మక్తాల జలంధర్‌, మక్తాల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 01:05 PM