Share News

ఫేక్ ఇంజూరీ.. పాక్ ప్లేయర్ ఇమామ్‌పై పీసీబీ విచారణకు ఆదేశం!

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:42 PM

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో గాయమని నటించి బ్యాటింగ్‌కు రాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చిక్కుల్లో పడ్డాడు. అతడి ఫేక్ ఇంజూరీపై విచారణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది.

ఫేక్ ఇంజూరీ.. పాక్ ప్లేయర్ ఇమామ్‌పై పీసీబీ విచారణకు ఆదేశం!
Imam ul Haq

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం ముదురుతోంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో గాయమని నటించి బ్యాటింగ్‌కు రాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చిక్కుల్లో పడ్డాడు. అతడి ఫేక్ ఇంజూరీపై విచారణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. అవసరమైతే ఇమామ్ న్యాయపరంగా సహాయం తీసుకునే అవకాశముందని సమాచారం. రెండో టెస్టులో ఇమామ్ కండరాలు పట్టేశాయని చెప్పి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో పాక్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓడిపోగా.. మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో కైవసం చేసుకుంది.


ఇమామ్ గాయంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావెద్ తీవ్రంగా స్పందించాడు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశాడు. ‘కండరాలు పట్టేశాయనే కారణంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు రాకపోవడం ఎలా సాధ్యం? గాయాలు ఆటలో భాగమే. గతంలో కాళ్లకు తీవ్ర గాయాలైన ప్లేయర్లు కూడా మైదానంలోకి వచ్చి ఆడేందుకు ప్రయత్నించారు. కానీ ఈ వ్యవహారం పూర్తిగా భిన్నంగా ఉంది. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆకిబ్ తెలిపాడు.


న్యాయవాదిని ఆశ్రయిస్తాడా?

ఇదిలా ఉంటే.. ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఈ విచారణను ఎదుర్కొనేందుకు న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇమామ్‌ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. రెండో టెస్టులో అతడి కాలి గాయం కారణంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌ చేయలేకపోయాడన్న అంశంపై పీసీబీ విచారణ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో అతడు న్యాయ సలహా తీసుకునే అవకాశముంది’ అని పాక్‌ క్రికెట్‌ బోర్డుకు సంబంధించిన ఓ వర్గం తెలిపింది.


ఏడుగురిపై వేటు

ఇంగ్లండ్‌ పర్యటనలో వరుస ఓటములు ఎదురైన నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇమామ్‌ ఉల్‌ హక్‌ సహా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. అంతేకాకుండా బౌలింగ్‌ కోచ్‌ ఉమర్‌ గుల్‌, హెడ్‌ కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 9 నుంచి బర్మింగ్‌హామ్‌లో మూడో టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్

Updated Date - Sep 02 , 2026 | 12:43 PM