పూరన్ను పంపించడానికి కారణమదే: లాంగర్
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:08 PM
లఖ్నవూతో నిన్న జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్లో లఖ్నవూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫామ్లో లేని నికోలస్ పూరన్ను సూపర్ ఓవర్లో పంపించడం గమనార్హం. దీనిపై లఖ్నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వివరణ ఇచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్నవూ ఏకానా స్టేడియం నిన్న(ఆదివారం) ఓ ఆసక్తికరమైన పోరాటానికి వేదికైంది. లఖ్నవూ సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే, సూపర్ ఓవర్లో లఖ్నవూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫామ్లో లేని, నరైన్ బౌలింగ్లో అసులు రికార్డు బాగోలేని నికోలస్ పూరన్ను సూపర్ ఓవర్లో పంపించడంపై ఎల్ఎస్జీ అభిమానులు అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై లఖ్నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ క్లారిటీ ఇచ్చాడు.
లాంగర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేకేఆర్ తరఫున సునీల్ నరైన బౌలింగ్ చేస్తాడని తెలుసు. ఇక నికోలస్ పూరన్ విషయానికి వస్తే..ప్రపంచ క్రికెట్లో నరైన్ను ఎక్కువగా ఎదుర్కొంది అతడే. అందుకే అతడు సరైన ఎంపిక అని మేం భావించాం. పూరన్ మంచి ఫామ్లో లేడనే విషయం తెలుసు. ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరిస్తాడు. కానీ, సూపర్ ఓవర్ను సమర్థంగా ఎదుర్కోగల ప్లేయర్ నికోలస్ పూరన్ అని గట్టిగా భావించాం' అని తెలిపాడు.
'మేము అత్యుత్తమ ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటాం. అలానే పూరన్కూ మద్దతుగా నిలిచాం. దురదృష్టవశాత్తూ అతడు తొలి బంతికే ఔటయ్యాడు. కొన్నేళ్లుగా టీ20లో అద్భుతమైన ప్లేయర్గా రాణించాడు. అతడూ మనిషే. అతడి ఆత్మవిశ్వాసాన్ని ఎవ్వరూ దెబ్బతియ్యలేరు. ఈ మ్యాచ్లో అతడిని తిరిగి ఫామ్లోకి వస్తాడనుకున్నాం. కానీ మా వ్యూహం విఫలమైంది. క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేం’ అని లాంగర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్ భార్య!
ఆంధ్ర నెట్ బౌలర్కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!