ఆస్ట్రేలియా సిరీస్కు భారత్ 'ఏ' ప్రకటన.. హార్దిక్ పాండ్యకు చోటు!
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:28 PM
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో మల్టీ డే, వన్డే సిరీస్లకు సంబంధించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత-ఏ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు అవకాశం దక్కింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా-ఏ జట్టుతో మల్టీ డే, వన్డే సిరీస్లకు సంబంధించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత- ఏ జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరి వేదికగా ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు అవకాశం కల్పించారు. అయితే, తుది జట్టులో స్థానం దక్కించుకోవాలంటే అతను తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని బీసీసీఐ షరత్ పెట్టింది.
హార్ధిక్ గత కొంతకాలంగా వైట్-బాల్ క్రికెట్పైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ, పనిభార నియంత్రణలో భాగంగా సీనియర్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత 'ఏ' జట్టు సిరీస్ ద్వారా గొప్ప అవకాశం లభించనుంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో ఆడే ఈ మ్యాచ్లు అతనికి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ను అందిస్తాయని సెలక్టర్లు భావిస్తున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా బీసీసీఐ సీనియర్ ప్లేయర్లపై దృష్టి సారిస్తోంది.
ఈ తరుణంలో.. హార్దిక్ ఫిట్నెస్, మ్యాచ్ ఆడే సన్నద్ధతపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అతను జట్టుకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాడనే దానిపై సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి మల్టీ-డే మ్యాచ్లు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ షురూ కానుంది. మరొవైపు గిల్ సేన వెస్టిండీస్తో సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య దేశవాళీ 'ఏ' మ్యాచ్ల ద్వారా రాణించాలని, త్వరలో సీనియర్ జట్టులోకి రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
భారత వన్డే-ఎ జట్టు:
ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, రజత్ పాటిదార్, కుషాగ్రా, నిశాంత్ సంధు, విప్రాజ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్, నమన్ ధీర్, హార్దిక్, ప్రభుసిమ్రన్ సింగ్, గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్
ఇవి కూడా చదవండి:
25 బంతులాడి డకౌటైన బ్యాటర్.. ఎవరంటే!
ఆసియా క్రీడలు జరగనున్న ప్రాంతంలో భారీ వరదలు..