వరదలో చిక్కుకున్న శునకం.. మానవత్వం చాటుకున్న యువకులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:10 PM
ప్రకృతి ప్రకోపించినప్పుడు మనుషులు, మూగ జీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. గంగానదిలో ఒక శునకం అనుకోకుండా చిక్కుకుంది. అంతలోనే కొంతమంది యువకులు దేవదూతల్లా వచ్చి శునకాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతికి కోపం వస్తే.. మనుషులు, మూగ జీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. గంగానదిలో ఒక శునకం అనుకోకుండా చిక్కుకుంది. అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో.. శునకం తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతోంది. ఆశలు అడుగంటిపోతున్న ఆ భయానక క్షణంలో, కొంతమంది యువకులు పడవపై వచ్చి శునకాన్ని కాపాడారు. మనుషుల్లోని మానవత్వాన్ని చాటిచెప్పే ఈ వీడియో అందరి హృదయాలను హత్తుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఒక శునకం అనుకోకుండా గంగానదిలో పడిపోయింది. అదే సమయంలో నీటి మట్టం పెరిగిపోవడంతో బయటకు రాలేక, నదిలో ఎత్తైన ప్రదేశాన్ని ఆసరాగా చేసుకొని నిస్సహాయంగా నిలబడి ఉంది. చుట్టూ పెరిగిపోతున్న నీటి మట్టం, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల మధ్య ఆ శునకం చావుకు చేరువలో ఉంది. శునకం పడుతున్న అవస్థలు గమనించిన కొంతమంది స్థానిక యువకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంతో రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి పడవపై వెళ్లి, ప్రాణాలకు తెగించి ఆ శునకం వద్దకు చేరుకున్నారు. అతి కష్టం మీద ఆ శునకాన్ని పట్టుకుని సురక్షితంగా పడవలోకి ఎక్కించుకున్నారు.
ఈ వీడియో saveastray.noida అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘దయగల మనుషులు కుక్కను సురక్షితంగా రక్షించారు’ అని కామెంట్ చేయగా,‘ఆ భయానక క్షణాలు చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది.. వాళ్లందరికీ సెల్యూట్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మనుషుల్లో ఇంకా మానవత్వం దాగి ఉంది.. అందుకు ఇదే గొప్ప ఉదాహారణ’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.