మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:16 AM
అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి తన మేనకోడలికి కోట్ల రూపాయలు విలువ చేసే డేగను బహుమతిగా ఇచ్చాడు. మేనమామతో కలిసి తెల్లడేగ వేలం పాటలో పాల్గొన్న యువతి 3.85 కోట్ల రూపాయలకు దాన్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి తన మేనకోడలికి కోట్ల రూపాయలు విలువ చేసే డేగను బహుమతిగా ఇచ్చాడు. మేనమామతో కలిసి తెల్లడేగ వేలం పాటలో పాల్గొన్న యువతి 3.85 కోట్ల రూపాయలకు దాన్ని సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా, అబుదాబీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అబుదాబీ ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ 2026’ జరిగింది. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ‘మార్క్ మోగ్లిచ్ ఫాల్కన్ ఫామ్’ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన తెల్ల డేగ ‘ప్యూర్ వైట్ గైర్ గర్మోషా’ను వేలానికి పెట్టింది.
1.5 కేజీల బరువు, 16.5 అంగుళాల పొడవు ఉన్న ఆ తెల్లడేగను సొంతం చేసుకోవడానికి అరబ్ సంపన్నులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. షైకా అల్ మన్సూరీ అనే యువతి తన మేనమామతో కలిసి ఈ వేలం పాటలో పాల్గొంది. తనే స్వయంగా వేలం పాట పాడి 1.5 మిలియన్ దినార్లకు ఆ తెల్ల డేగను సొంతం చేసుకుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. ఆ డేగ కోసం మన్సూరీ ఏకంగా 3.85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
నీకు డేగల మీద మక్కువ ఎలా పుట్టిందని మీడియా ప్రతినిధులు మన్సూరీని అడగ్గా.. ‘మేనమామ వల్లే’ అని చెప్పింది. మన్సూరీ వేలం పాటలో పాల్గొన్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘తెల్ల డేగ ఖరీదు 3.5 కోట్లా?..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు