సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:15 PM
రాబోయే ప్రకృతి విపత్తుకు సంకేతంగా జపాన్ ప్రజలు భావించే ఓర్ఫిష్ చేపలు మెక్సికో సముద్ర తీరంలో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ప్రపంచమంతా భయం ఆవరించింది. ఈ నేపథ్యంలో అరుదైన చేపలు రెండు సముద్రం ఒడ్డుకి కొట్టుకురావడంతో జనాల్లో ఆందోళనలు పీక్స్ చేరాయి. ఏదో ప్రకృతి విపత్తు ప్రపంచాన్ని ముంచెత్తే అవకాశం ఉందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ బీచ్ ఒడ్డున ఇటీవల రెండు ఓర్ఫిష్లు కనిపించాయి. వీటికి డూమ్స్ డే చేపలని కూడా పేరుంది. సాధారణంగా ఇవి సముద్రంలో దాదాపు 3 వేల అడుగుల లోతున నివసిస్తుంటాయి. ప్రకృత్తి విపత్తులు ముంచెత్తే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇవి సముద్రం ఒడ్డుకు వస్తాయని జపాన్ ప్రజలు నమ్ముతారు. ఇవి ఒక్కొక్కటీ దాదాపు 30 అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. ఇక మెక్సికోలో ఒడ్డుకు చేరి గిలగిలా కొట్టుకున్న ఈ ఓర్ఫిష్లను ఒక మహిళ మళ్లీ సముద్రంలో విడిచిపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఇక వీడియోలపై జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సెటైర్లు కూడా పేల్చారు. ఒడ్డుకు చేరిన చేపలను మళ్లీ సముద్రంలో వదిలిపెట్టారు కాబట్టి ముప్పు తప్పినట్టే అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. రెండు చేపలు వచ్చాయి కాబట్టి రెండింతలు భయానకమైన విపత్తు మానవాళిని ముంచెత్తనుందా? అని మరొకరు సరదాగా ప్రశ్నించారు.
ఒడ్డుకు చేరిన చేపలను మళ్లీ నీటిలో వదిలిపెట్టినా అవి బతకవని మరికొందరు అన్నారు. సముద్రంలో అంత లోతున ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో అవి జీవిస్తాయని, ఒక్కసారి ఒడ్డుకు చేరుకున్నాక వాటి అవయవాలు దెబ్బతింటాయని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఈ వార్తలూ రాయండి:
మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్లో దిగితే..
ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..