నేపాల్ వరదల్లో మృత్యుంజయురాలు.. శిథిలాల కింద మూడు రోజులు..
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:14 PM
చుట్టూ ఎటుచూసినా వరద బీభత్సం.. కళ్లముందు కనిపించని తల్లిదండ్రులు.. శిథిలాల కింద మూడు రోజులుగా ఒంటరిగా పోరాడిన ఆరేళ్ల చిన్నారి.. చివరకు ఆమె ఏడుపు రెస్క్యూ సిబ్బందికి వినిపించింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ను వణికించిన ఘోర వరదల విషాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో మట్టి, శిథిలాల కింద ఆరేళ్ల బాలిక చిక్కుకుంది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. భోటే కోశి నదికి వచ్చిన ఆకస్మిక వరదల అనంతరం గల్లంతైన వారి కోసం ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గాలింపు చేపడుతుండగా.. శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ శబ్దాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించి బాలికను బయటకు తీసుకువచ్చారు.
బుధవారం హిమానీనదం కూలిపోవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించి పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరం గాలిస్తున్నాయి. ఇలాంటి విషాద పరిస్థితుల్లో మూడు రోజుల పాటు శిథిలాల మధ్య ప్రాణాలతో పోరాడిన చిన్నారి రక్షణ అందరిలోనూ ఆశలు రేకెత్తించింది. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు ఖాట్మండుకు తరలించారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు