ఆ రిస్క్ మాత్రం చేయలేను.. ఏసీ టెక్నీషియన్ వీడియో వైరల్
ABN , Publish Date - May 01 , 2026 | 01:56 PM
ఏసీ టెక్నీషియన్ ఒకరు తాజాగా షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఏసీ కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని జనాలు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏసీ సర్వీసింగ్ చేయమని కస్టమర్ అడిగితే తాను తిరస్కరించానంటూ టెక్నీషియన్ ఒకరు నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రూ.400 కోసం తాను ప్రాణాలను రిస్క్ చేయలేనని ఆ టెక్నీషియన్ చెప్పుకొచ్చారు. ఈ ఉదంతంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడ ఒక ఆకాశహర్మ్యంలోని 23వ అంతస్తులో ఒక వ్యక్తి ఏసీని పెట్టించుకున్నారు. అయితే, ఏసీ ఔట్ డోర్ యూనిట్ను అత్యంత ప్రమాదకరమైన చోట ఏర్పాటు చేశారని టెక్నీషియన్ చెప్పారు. సర్వీస్ చేసేందుకు ఔట్ డోర్ యూనిట్ను చేరుకునేందుకు సరైన మార్గం లేదని టెక్నీషియన్ ఆరోపించారు. అంత ఎత్తు నుంచి పొరపాటున కింద పడితే ప్రాణాలు పోతాయని అన్నారు. రూ.400ల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టలేనని తేల్చి చెప్పారు. చివరకు కస్టమర్ రిక్వెస్ట్ను తిరస్కరించి వెనక్కు వచ్చేసినట్టు తెలిపారు. భద్రత విషయంలో ప్రజలకు కనీస అవగాహన ఉండటం లేదని వాపోయారు.
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఏసీ టెక్నీషియన్ అభిప్రాయంతో ఏకీభవించారు. చాలా మంది కస్టమర్లు కొత్త ఏసీ ఏర్పాటు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరని అన్నారు. ఇలాంటి పనుల వల్ల సామాన్య కార్మికులు రిస్క్లో పడతారని అన్నారు. ఏసీ కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
మురికి కాల్వలో స్నానం.. ఆహారాన్ని మురికి నీళ్లలో ముంచి..
బస్సును ప్రమాదం నుంచి బయటపడేసిన విద్యార్థులు.. వీడియో వైరల్..