మృత్యువు అంచున మృగరాజు.. గుజరాత్లో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్!
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:03 AM
గుజరాత్లోని ఉనా తాలూకా, నవబందర్ సమీపంలో నీటితో నిండిన వ్యవసాయ బావిలో ఒక సింహం ప్రమాదవశాత్తు పడిపోయింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్ని సమయాల్లో అవి బావుల్లో పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. తాజాగా గుజరాత్లోని ఉనా తాలూకా, నవబందర్ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక సింహం ప్రమాదవశాత్తు పడిపోయింది. బావి నీరు నిండుగా ఉండటంతో సింహం ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించసాగింది. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింహాన్ని సురక్షితంగా బయటకు తీసేందుకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సింహాన్ని సురక్షితంగా రక్షించి, బోనులో బంధించి జసంధర్ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
వైరల్ అయిన వీడియోలో.. అధికారులు సింహానికి తాడు కట్టి బావిలోంచి బయటకు లాగడం కనిపిస్తుంది. చాలా మంది బావి చుట్టూ చేరి, సింహాన్ని నీటిలోంచి రక్షించడానికి తాడును లాగుతూ కనిపిస్తున్నారు. దాదాపు గంటసేపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్లో, సింహాన్ని తాడుల సహాయంతో చాకచక్యంగా పైకి లాగారు. సింహం భయంతో దాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు ఎంతో ధైర్యంతో ఆ జంతువును సురక్షితంగా బయటకు తీశారు.
బావి నుంచి బయటకు తీసిన వెంటనే సింహాన్ని సురక్షితంగా బోనులో బంధించారు. ప్రస్తుతం ఆ సింహానికి ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకోవడానికి మరియు తదుపరి పరిశీలన కోసం జసంధర్ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అటవీ అధికారుల సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి
రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీ కేబినెట్ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..