భారతీయ కుటుంబానికి సర్ప్రైజ్ ఇచ్చిన దుబాయ్ పాలకుడు
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:20 PM
ఓ భారతీయ కుటుంబానికి దుబాయ్ పాలకుడు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తమకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి లభించిందని కామెంట్ చేస్తూ ఆ భారతీయ కుటుంబం వీడియోను కూడా షేర్ చేసింది. ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ ఓ భారతీయ కుటుంబానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది (Dubai Ruler Surprise to Indian Family).
యూఏఈలో ఉండే సౌరభ్ జైన్, తన భార్య, పిల్లలు మిషికా, తక్ష్లతో కలిసి ఇటీవల సెలవు రోజున అల్ ఖుద్రా సరస్సుకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న కారును చూడగానే సౌరభ్ భార్య గుర్తుపట్టారు. అది దుబాయ్ పాలకుడు షేఖ్ మొహమ్మద్ కారు అని దాని నెంబర్ ప్లేట్ చూడగానే ఆమెకు అర్థమైంది. దీంతో, కుటుంబమంతా కారు వైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
అయితే, వారు ఊహించని విధంగా దుబాయ్ పాలకుడు తన కారు అద్దాలను కిందకు దింపి ఆ కుటుంబానికి అభివాదం చేశారు. అంతేకాకుండా, సౌరభ్ పిల్లలను తన కారు వద్దకు పిలిపించుకుని ఫొటోలు కూడా దిగారు. సౌరభ్ కూతురికి కోల్డ్ కాఫీని కూడా ఆఫర్ చేశారు.
‘వారితో కలిసి ఒక ఫోటో దిగుతామని మేము అభ్యర్థించాము. మా అబ్బాయి షేఖ్కు పెద్ద అభిమాని. దీంతో, ఆయన వెంటనే అంగీకరించారు. పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అంతే కాకుండా, నా కూతురికి కోల్డ్ కాఫీని కూడా అందించారు’ అని సంబరపడిపోతూ సౌరభ్ తెలిపారు.
ఈ టూర్ తమకు ఊహించని విధంగా ఒక మధురానుభూతిని మిగిల్చిందని సౌరభ్ ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. షేఖ్ కరుణ, నా బిడ్డలకు ఇచ్చిన దీవెనలు తమకు జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయని అన్నారు. ఇక ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి!
ఈ వార్తలూ చదవండి:
వీళ్లు మారేదెన్నడో.. వందే భారత్ రైల్లో మళ్లీ అదే సీన్
అప్పటి వరకూ పాడేదే లేదు.. స్టేజ్పై ప్రముఖ గాయని అల్టిమేటమ్