Share News

జీవితం అంటే రూ. లక్షలు సంపాదించడం కాదు.. అసలైన సంతోషం ఇదే.!

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:53 PM

29 ఏళ్లకే కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన ఓ మహిళ ఇప్పుడు వ్యవసాయ జీవితం గడుపుతోంది. పుణెలో ఉద్యోగాన్ని వదిలి ప్రకృతికి దగ్గరగా, స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఆమె అనుసరించిన నాలుగు దశల ప్రణాళిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జీవితం అంటే రూ. లక్షలు సంపాదించడం కాదు.. అసలైన సంతోషం ఇదే.!
29 year Old Woman Retirement

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఉద్యోగం చేసిన తర్వాత వయసు పైబడినప్పుడు పదవీ విరమణ చేస్తారు. కానీ పుణెలో కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తున్న స్నేహా రాజ్‌గురు మాత్రం 29 ఏళ్లకే ఉద్యోగాన్ని వదిలేశారు. ఉద్యోగ ఒత్తిడికి దూరంగా ఉండి, ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.

తన నిర్ణయం గురించి స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇందులో 29 ఏళ్లకే తాను ఉద్యోగానికి రిటైర్మెంట్‌ ఇచ్చానని చెప్పారు. భూమి కొనడం, పండ్ల చెట్లు నాటడం, సొంతంగా ఆహారాన్ని పండించుకోవడం, ఖాళీ స్థలంలో పూల మొక్కలు పెంచడం.. ఇలా నాలుగు దశల ప్రణాళికను వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


మొదటి అడుగు.. సొంత భూమి

సొంతంగా ఒక చిన్న భూమిని కొనుగోలు చేసి, దానికి తనదైన గుర్తింపు తీసుకురావడం మొదటి అడుగు అని స్నేహా తెలిపింది. ఇందుకు తన సొంత ఫామ్‌ను ఉదాహరణగా చూపించింది. తనకు నచ్చిన విధంగా భూమిని అభివృద్ధి చేసుకుంటూ ప్రకృతికి దగ్గరగా జీవించవచ్చని పేర్కొంది.

రెండో అడుగు.. పండ్ల చెట్లు

భూమిలో పండ్ల చెట్లను నాటడం రెండో దశ అని ఆమె చెప్పింది. పండ్ల చెట్లకు ప్రారంభంలో కొంత శ్రద్ధ అవసరమైనప్పటికీ.. అవి పెరిగిన తర్వాత ఎక్కువ శ్రమ లేకుండానే ఏళ్ల తరబడి ఫలాలను అందిస్తాయని తెలిపింది.

మూడో అడుగు.. సొంతంగా ఆహారం పండించుకోవడం

తనకు అవసరమైన ఆహారంలో కొంత భాగాన్ని అయినా సొంతంగా పండించుకోవాలని స్నేహా సూచించింది. ఇలా చేయడం వల్ల కల్తీ ఆహార పదార్థాలపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పింది. లాక్‌డౌన్‌ లేదా యుద్ధం వంటి అనుకోని పరిస్థితులు ఎదురైనా.. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకుంటే ఇబ్బందులు తక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. ఆహార భద్రత కోసం సొంతంగా పంటలు పండించుకోవడం ఉపయోగపడుతుందని పేర్కొంది.


నాలుగో అడుగు.. భూమంతా పూలతో నింపడం

నాలుగో దశగా తమ భూమిలో పూల మొక్కలను పెంచాలని ఆమె చెప్పింది. పూలు, పచ్చదనం మనసుకు ప్రశాంతతను అందిస్తాయని తెలిపింది. రోజూ అందమైన ప్రకృతి వాతావరణాన్ని చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆమె పేర్కొంది. కేవలం శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే కాకుండా.. మనసుకు ఆనందాన్ని ఇచ్చే వాతావరణాన్ని కూడా మనమే సృష్టించుకోవాలని సూచించింది.

పదవీ విరమణ అంటే ఇదేనంటున్న స్నేహా

స్నేహా దృష్టిలో పదవీ విరమణ అంటే ఒక నిర్దిష్ట వయసులో ఉద్యోగాన్ని ఆపేయడం మాత్రమే కాదు. జీవితంలో ఉద్యోగ ఒత్తిడితో లక్షలు సంపాదించడం కంటే ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడమే అసలైన పదవీ విరమణ అని ఆమె చెబుతోంది. కార్పొరేట్‌ ఉద్యోగంలోని నిరంతర ఒత్తిడికి బదులుగా వ్యవసాయం, ప్రకృతి, సొంతంగా ఆహారం పండించుకోవడం వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ప్రశాంతమైన జీవితం గడపవచ్చని ఆమె అభిప్రాయపడింది.

ఆమె చెప్పిన నాలుగు దశలు కేవలం ఉద్యోగాన్ని వదిలేయడం గురించి మాత్రమే కాదు. స్వయం సమృద్ధిగా జీవించడం, ప్రకృతికి దగ్గరగా ఉండటం, సొంత ఆహారాన్ని పండించుకోవడం, రోజువారీ జీవితాన్ని ఒత్తిడితో కాకుండా ప్రశాంతంగా గడపడం వంటి అంశాలపై దృష్టి పెట్టే జీవన విధానానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.


Also Read:

తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

వందేమాతరం రెండు చరణాలనే పాడతాము: కర్ణాటక సీఎం

Updated Date - Aug 26 , 2026 | 04:27 PM