భక్తిశ్రద్ధలతో రథసప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం..
ABN, Publish Date - Jan 25 , 2026 | 09:25 PM
రథసప్తమి సందర్భంగా దేవుని కడప, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
1/8
తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాఘ మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే రథసప్తమి రోజున ఇక్కడ నిర్వహించే రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.
2/8
ఈ ఏడాది దేవుని కడపలో 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 18వ తేదీన అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ వాహనం, 24న కళ్యాణోత్సవం, 25న రథసప్తమి సందర్భంగా ధూళి ఉత్సవంతో పాటూ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
3/8
స్వామివారు భక్తుల మధ్య భారీ రథంపై ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో కూడా ఈ రథోత్సవ వైభవాన్ని వర్ణించారు.
4/8
రథోత్సవాన్ని వీక్షించేందుకు కడప జిల్లాతో పాటూ చుట్టు పక్క ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నారులు, యువత, వృద్ధులు అందరూ ఉత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
5/8
ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు విశేష అలంకరణ చేశారు. అలాగే రథాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలు, రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.
6/8
రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.
7/8
రథసప్తమి ఆదివారం రోజు జరగడంతో మరింత అదృష్టకరంగా భావించి.. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అధికారుల అంచనా ప్రకారం 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.
8/8
భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఆలయ కమిటీ అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. భక్తులకు ప్రసాదం, ఆహార ప్యాకెట్లు వంటి సేవలు అందించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.
Updated at - Jan 25 , 2026 | 09:27 PM