రాజా కసుకుర్తి సేవలు సమాజానికి ఆదర్శం: ఆర్టీసీ మాజీ చైర్మన్ కొనకళ్ల
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:46 AM
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు.. చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు.. చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన తాగునీటి ట్యాంకర్ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి, పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. అదేవిధంగా చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75 వేల విలువైన వీడ్ వాకర్ను (వ్యవసాయ పరికరం) విరాళంగా అందించారు.

తాగునీటి ట్యాంకర్, వాటర్ డిస్పెన్సర్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సమష్టిగా ప్రారంభించారు. ‘పీ-4’ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ట్యాంకర్ ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ..‘ప్రజలకు సేవలందించడం సామాజిక బాధ్యతగా భావించి రాజా కసుకుర్తి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాజా కసుకుర్తి సేవలు అందరికీ ఆదర్శం’ అని అన్నారు.

ఇతర నాయకులు మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించడం వల్ల వారి పనులు సులభమవుతాయని, ఈ కార్యక్రమం వారికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ప్రముఖులు కలపాల శ్రీధర్, గుండపనేని ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ పిల్లా అనిత, రామారావు, అమృతవల్లి సూర్యనారాయణ, లంక అజయ్, మండాది రవీంద్ర, ఇతర గ్రామ పెద్దలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి
పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..
ఓటేయడం మీ బాధ్యత, కర్తవ్యం: ప్రధాని మోదీ