Share News

50 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM

50 ఏళ్లు పైబడిన మహిళలకు పలు రకాల ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి వాటిని ముందస్తుగా గుర్తించడం కోసం క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ...

50 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు తప్పనిసరి

డయాగ్నొసిస్‌

50 ఏళ్లు పైబడిన మహిళలకు పలు రకాల ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి వాటిని ముందస్తుగా గుర్తించడం కోసం క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలంటున్నారు వైద్యులు.

ఆ పరీక్షల గురించి తెలుసుకుందాం!

50 ఏళ్లు దాటిన మహిళలు, పెరి మెనోపాజ్‌ దాటిన మహిళలు తప్పనిసరిగా చేయించుకోవలసిన పరీక్షలు కొన్ని ఉన్నాయి. ప్రాథమిక రక్త పరీక్ష మొదలు, మధుమేహం, థైరాయిడ్‌, కాలేయ పనితీరు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ వయసు మహిళలకు ఈస్ట్రోజన్‌ రక్షణ ఉండదు కాబట్టి లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష కూడా అవసరమే, అలాగే విటమిన్‌ బి12, విటమిన్‌ డి, మెగ్నీషిం, ఫాస్ఫరస్‌, ఎలకొ్ట్రలైట్‌ పరీక్షలు కూడా చేయించుకోవాలి. మెనోపాజ్‌ మహిళల్లో సోడియం లోపం కూడా తలెత్తుతుంది. సాధారణంగా మగతగా, నిస్సత్తువగా అనిపించినప్పుడు పైబడే వయసులో ఇదంతా మామూలే అనుకుంటే పొరపాటు మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో సోడియం క్షీణత సర్వసాధారణం. కాబట్టి ఎలకొ్ట్రలైట్‌ పరీక్షతో ఈ లోపాన్ని కనిపెట్టి సరిదిద్దుకోవాలి.

గర్భాశయం భద్రంగా...

ఇసిజి పరీక్ష తప్పనిసరి. అవసరాన్ని బట్టి అధిక బిఎమ్‌ఐ ఉన్నవాళ్లకు 2డి ఇకొ పరీక్ష, సిటి యాంజియో కూడా చేయించవలసి వస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముందుగానే పసిగట్టడం కోసం పాప్‌స్మియర్‌, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. లక్షణాలు బయల్పడినప్పుడే ఈ పరీక్షలను ఆశ్రయించడానికి బదులుగా, ముందు నుంచే ఈ పరీక్షలతో అప్రమత్తంగా వ్యవహరించగలిగితే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగే వీలు చిక్కుతుంది. గర్భాశయం లోపలి పొర మందాన్ని పరీక్షించడం కోసం, అల్ర్టాసౌండ్‌ పూరీక్ష తోడ్పడుతుంది. ఈ పరీక్షతో గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే కనిపెట్టవచ్చు. పాప్‌స్మియర్‌ పరీక్ష ప్రతి మూడేళ్లకోసారి చేయించుకోవాలి.


ఎముకలు దృఢంగా...

50 ఏళ్లు పైబడిన మహిళల్లో, ఎముక దృఢత్వం, ఎముక ఆరోగ్యం కూడా ఎంతో కీలకం. కాబట్టి అస్థిపంజర కండరాల సాంద్రత, దృఢత్వాలను తెలిపే సార్కోపీనియా పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో తేడాలుంటే, ఎముక సాంద్రతను తెలిపే డెక్సాశ్కాన్‌ అవసరమవుతుంది. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల అత్యధిక మరణాలు క్యాన్సర్‌ లేదా ఇతరత్రా వ్యాధులని అనుకుంటాం. కానీ నిజానికి ఎముకలు విరిగి, తత్ఫలితంగా పడకకే పరిమితమైపోవడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తడం, గాయం మానకపోవడం, ఇతరత్రా తలెత్తే ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మహిళలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. కాబట్టి మధ్య వయసు మహిళల్లో ఎముకల ఆరోగ్యం కీలకంగా మారుతుంది. కాబట్టి మెనోపాజ్‌కు చేరుకుని ఐదేళ్లు గడిచిన ప్రతి మహిళా డెక్సాశ్కాన్‌ చేయించుకోవడం తప్పనిసరి. అలాగే కండర శక్తిని పెంచే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి.

ప్రొటీన్‌ పెంచాలి

యాభై ఏళ్లు దాటిన మహిళలకు మధుమేహం, రక్తపోటు పెరుగుతాయి. కాబట్టి వీటిని మందులతో అదుపులో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు అదుపు తప్పడం లాంటి సమస్యలను కౌన్సెలింగ్‌తో సరిదిద్దుకోవాలి. బరువును అదుపులో ఉంచుకుంటూ, సమతులాహారం తీసుకుంటూ, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. పొట్ట పెరగడం పలు రకాల ఆరోగ్య సమస్యలకు సూచన. కాబట్టి పొట్ట పెరగకుండా చూసుకోవాలి. నూనె వాడకం తగ్గించాలి. మాంసాహారాన్ని తగ్గించి శాకాహారం పెంచాలి. ప్రొటీన్‌ కోసం రోజూ గుడ్లు, పన్నీర్‌, బఠాణీలు, బీన్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పైన చెప్పిన పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నప్పుడు ప్రతి మూడేళ్లకోసారి పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. లేదంటే ఏడాదికోసారి అన్ని పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.

డాక్టర్‌ ఎ. మహిత రెడ్డి

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

అపోలో క్రేడిల్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 12:37 AM