Share News

చుండ్రు వేధిస్తోందా..

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:12 AM

ఎండాకాలంలో వేడివల్ల తలలో అధికంగా చెమట పట్టి చుండ్రు మాడుకు అతుక్కుపోతుంది. దీంతో తలంతా దురదగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో...

చుండ్రు వేధిస్తోందా..

ఎండాకాలంలో వేడివల్ల తలలో అధికంగా చెమట పట్టి చుండ్రు మాడుకు అతుక్కుపోతుంది. దీంతో తలంతా దురదగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో ఈ చుండ్రును వదిలించుకోవచ్చు.

  • చిన్న గిన్నెలో నాలుగు చెంచాల నిమ్మరసాన్ని తీసుకుని అందులో అయిదు చెంచాల మంచినీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ మాడుకు పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మాడు మీద పీహెచ్‌ స్థాయిలు సమతుల్యమై చుండ్రు మాయమవుతుంది.

  • పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసి అందులో రెండు గుప్పెళ్ల వేపాకులు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని గోరువెచ్చగా చల్లార్చి తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • రాత్రి పడుకునేముందు చిన్న కప్పు మెంతులను నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా రుబ్బి తలకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే మాడుమీద చర్మం తేమతో నిండి చుండ్రు తగ్గుతుంది.

  • కలబంద గుజ్జును చల్లటి నీటిలో ముంచి తీసి మాడుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రభావవంతంగా పనిచేసి చుండ్రును తొలగిస్తాయి.

  • పెరుగు లేదా కోడిగుడ్డు తెల్ల సొనను మాడుకు పట్టించి తలస్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, మంచినీళ్లను సమపాళ్లలో కలిపి తలకు పట్టించి ఒక పూట తరువాత తలస్నానం చేసినా ప్రయోజనం ఉంటుంది.

  • రెండు చెంచాల కొబ్బరి నూనెలో చెంచా టీ ట్రీ ఆయిల్‌ కలిపిన మిశ్రమాన్ని లేదా మందార నూనెను పట్టించినా చుండ్రు తొలగి మాడు ఆరోగ్యవంతంగా మారుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 04:12 AM