ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:17 PM
ఛత్తీస్గఢ్లో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిలాస్పూర్కు చెందిన 25 ఏళ్ల కమ్తా ప్రసాద్ సూర్య వంశీ హోటల్లో సర్వర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి హోటల్కు దగ్గరలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం అతడికి ఇన్స్టాగ్రామ్లో 22 ఏళ్ల రోషిణి సూర్యవంశీతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కలిసి తిరిగే వారు.. ఫోన్లో గంటలు, గంటలు మాట్లాడుకునే వారు. అయితే, గత మూడు రోజుల నుంచి ప్రసాద్ వింతగా ప్రవర్తించటం మొదలెట్టాడు. రోషిణి ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశాడు. దీంతో రోషిణి తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడేమోనన్న అనుమానం వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కత్తి తీసుకుని ప్రసాద్ ఉండే ఇంటి దగ్గరకు వెళ్లింది. ప్రసాద్ తలుపు తెరవగానే అతడి మొబైల్ ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతడు ఇందుకు ఒప్పుకోలేదు.
ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. కట్టలు తెంచుకున్న కోపంతో రోషిణి ప్రసాద్పై కత్తితో దాడి చేసింది. నేరుగా అతడి ఛాతీపై పొడిచింది. ప్రసాద్ గట్టిగా అరవటంతో లోపల ఉన్న ఫ్రెండ్ బయటకు వచ్చాడు. ప్రసాద్ నేలపై రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వెంటనే ప్రసాద్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రసాద్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితురాలు రోషిణిని అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారి సుమ్మత్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ యువతి మృతుడి ఇంటికి వచ్చింది. అతడి ఫోన్ ఇవ్వమని డిమాండ్ చేసింది. గొడవ సందర్భంగా కత్తితో అతడి ఛాతీపై పొడిచింది. అతడు అక్కడికక్కడే చనిపోయాడు’ అని తెలిపారు. కాగా, బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ రాజేష్ సూర్యవంశీకి ప్రసాద్ మేనల్లుడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
లిబియా మాజీ నేత గడాఫీ కుమారుడి హత్య..
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని