గన్తో బెదిరించి పట్టపగలు జ్యువెలరీ షాప్లో దోపిడీ.. సీసీటీవీలో మొత్తం రికార్డ్..
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:25 AM
బైక్ పై బంగారం షాప్ దగ్గరకి వచ్చారు ఇద్దరు కేటుగాళ్లు. మంకీ క్యాప్, పైన హెల్మెట్లు తీయకుండానే షాప్ లోకి ప్రవేశించారు. ఉన్నపళంగా తుపాకీ తీసి షాప్ సిబ్బందిని బెదిరించారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 27: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. నిన్న(సోమవారం) సాయంత్రం 4 గంటల సమయంలో గోల్డ్ షాపును లూటీ చేశారు కేటుగాళ్లు. ఇద్దరు మాస్క్ (మంకీ క్యాప్), హెల్మెట్ ధరించిన దొంగలు బైక్పై వచ్చి ఆభరణాల దుకాణంలోకి వెళ్లారు. అనంతరం దుకాణ సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఒకడు దుకాణంలో ఆభరణాలు దోచుకుంటుంటే, మరొకడు సిబ్బందికి తుపాకీ గురిపెట్టి భయపెట్టాడు. దుకాణం బయట ఉన్న ఒక మహిళను కూడా వీళ్లు వదల్లేదు. ఆమెనీ తుపాకీతో బెదిరించారు. దీంతో షాప్ సిబ్బంది భయంతో ఆభరణాల సెట్లను ర్యాక్స్ నుంచి తీసి ఇచ్చేశారు.
దోపిడీ పూర్తయ్యాక ఇద్దరు దొంగలూ మోటార్సైకిల్పై పారిపోయారు. దుకాణంలోని సీసీటీవీలో పూర్తి ఘటన రికార్డ్ అయింది. ఒక దొంగ ఆభరణాలు తీసుకుంటుంటే, మరొకడు తుపాకీ చూపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దోపిడీ గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దోచుకున్న ఆభరణాల విలువ ఎంతన్నది ఇంకా కచ్చితంగా తెలియరాలేదు. కాగా, కర్ణాటకలో 10 రోజుల క్రితం ఇదే తరహా దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలు పురుషుల వేషంలో బెంగళూరులో దోపిడీ చేసి పట్టుపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News