వియత్నాంలో 15 మంది భారతీయుల మృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:51 PM
వియత్నాంలోని ఫు క్వాక్ దీవుల సమీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వియత్నాంలోని ఫు క్వాక్ దీవుల సమీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ పోస్టు చేశారు.
ప్రధాని ఎక్స్ పోస్ట్..
'వియత్నాంలోని ఫు క్వాక్ సమీపంలో భారతీయులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన విషాద వార్త తెలిసి తీవ్రంగా కలత చెందాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం' అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు.
36 మందితో వెళ్తుండగా ప్రమాదం..
వియత్నాంలోని హోన్ మే రుట్ దీవి నుంచి బయలుదేరిన పర్యాటక పడవ సముద్రంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 36 మంది ప్రయాణిస్తున్న ఈ బోటులో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో బలమైన అలల కారణంగా పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 21 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే ఇద్దరు మహిళలు, 13 మంది పురుషులు సహా మొత్తం 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
బాధితులకు అండగా భారత్..
ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రమాదానికి గురైన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
అత్యవసర కేంద్రాలు ఏర్పాటు..
వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రమాదాన్ని ధ్రువీకరించింది. ఈ మేరకు బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీ, హనోయిలో అత్యవసర స్పందన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 'ఫు క్వాక్ దీవి సమీపంలో కొద్దిసేపటి క్రితం పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. స్థానిక అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు' అని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీ నేతకు దక్కని ఎమ్మెల్యే టికెట్.. దాటియాలో చెలరేగిన అలర్లు..
హృదయవిదారకం.. నాలుగు గంటల పాటు ఇంటి పైకప్పుపై మృతదేహంతో..