యూపీఐ వాణిజ్య లావాదేవీలపై చార్జి?
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:53 AM
భవిష్యత్తులో వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ట్రాన్జాక్షన్ చార్జీలు విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన లావాదేవీల చట్టం సవరణ బిల్లుతో యూపీఐ,...
0.25%-0.50% వరకు విధించే అవకాశం
రూ.2000 దాటిన లావాదేవీలపైనే ఎండీఆర్
వ్యక్తులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు
మాల్స్, సూపర్మార్కెట్లు, కార్పొరేట్ సంస్థలకు
వర్తింపు.. లోక్సభలో బిల్లు పెట్టిన ఆర్థిక మంత్రి
ఇప్పట్లో ఎండీఆర్ లేదంటున్న ప్రభుత్వవర్గాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: భవిష్యత్తులో వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ట్రాన్జాక్షన్ చార్జీలు విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన లావాదేవీల చట్టం సవరణ బిల్లుతో యూపీఐ, రూపే చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మర్చెంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలను విధించేందుకు చట్టబద్ధమైన అధికారం కలగనుంది. 2007 నాటి చట్టానికి 2019లో చేసిన సవరణ ప్రకారం యూపీఐ, రూపేలపై ఎండీఆర్ చార్జీలను విధించే అవకాశం లేదు. ప్రస్తుతం ఏటా కోటానుకోట్ల రూపాయల విలువైన యూపీఐ, రూపే లావాదేవీలు జరుగుతుండటంతో వాటి నిర్వహణకు ఫిన్టెక్ కంపెనీలకు భారీఎత్తున ఖర్చు అవుతోంది. అందులో కేవలం 15 శాతం వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. మొదట్లో లావాదేవీలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరించేది. లావాదేవీలు భారీగా పెరిగాయి. దేశంలో ప్రస్తుతం నెలకు 1500 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. సర్వర్ల నిర్వహణ, సైబర్ భద్రత, బ్యాంకుల నిర్వహణ వ్యయం పెరిగాయి. దాంతో కేంద్రం ఇచ్చే సొమ్ము వంద శాతం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 15 శాతానికి వచ్చింది. తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొంది, చట్టరూపం దాలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన రోజు వాణిజ్య లావాదేవీల మీద వీసా, మాస్టర్కార్డు, పేపాల్, యాపిల్పే తరహాలో మన యూపీఐ, రూపేల మీద కూడా ఎండీఆర్ చార్జీలు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే, వ్యక్తుల మధ్య, వ్యక్తులకు, చిన్న వ్యాపారులకు మధ్య జరిగే లావాదేవీలకు ఎండీఆర్ చార్జీలు ఉండవు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ సంస్థల్లో రూ.2000 దాటిన లావాదేవీల మీద భవిష్యత్తులో ఎండీఆర్ చార్జీలు విధించే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ ఫిన్టెక్ కంపెనీలు 0.5ు నుంచి 4.4ు వరకు ఎండీఆర్ చార్జీలు వసూలు చేస్తుండగా, యూపీఐ, రూపే ఎండీఆర్ చార్జీలు 0.25ు నుంచి 0.50ు వరకు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సమకూరే మొత్తాలతో ఫిన్టెక్ కంపెనీలు భారీ సర్వర్లను సమకూర్చుకోగలవు. సైబర్ సెక్యూరిటీకి పెద్ద మొత్తాలను కేటాయించగలవు. ఈ బిల్లు ప్రవేశపెట్టినంత మాత్రాన ఎండీఆర్ చార్జీలు విధిస్తామని అర్థం కాదని, అందుకు వెసులుబాటు కల్పించుకుంటున్నామని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జనన మరణాల నమోదు రెండేళ్లు ఆలస్యమైతే రూల్స్ మరింత కఠినం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆలస్యంగా జనన మరణాల నమోదు చేసే సందర్భాల్లో నిబంధనలను కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును మంగళవారం పార్లమెంటు ఆమోదించింది. రెండేళ్లపాటు జాప్యం జరిగినప్పుడు వాటిని నమోదు చేయాలంటే ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జననమరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు-2026ను తీసుకొచ్చింది. ప్రతిపక్షాలు చేసిన నినాదాల నడుమ ఈ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. శుక్రవారమే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 1969లో ఆమోదం పొందిన ప్రస్తుత చట్టం ప్రకారం నమోదులో ఏడాదిపాటు ఆలస్యమైతే జిల్లా మేజిస్ట్రేటు, సబ్డివిజనల్ మేజిస్ట్రేటు, లేదా ఆథరైజ్డ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రూల్ను కొనసాగిస్తునే రెండేళ్లకు మంచి ఆలస్యం జరిగితే ఆ అధికారాన్ని న్యాయాధికారికి కట్టబెడుతూ చట్టాన్ని సవరించింది. బిల్లుకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యుడు రవిచంద్ర మాట్లాడారు.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు