కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:18 PM
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇకపై గతంలో మాదిరిగా తాను ఎక్కువగా పని చేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇకపై గతంలో మాదిరిగా తాను ఎక్కువగా పని చేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల వేళ గడ్కరీ మాటలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని గుర్తు చేసుకున్నారు. గతంలో పార్టీ, ప్రభుత్వం కోసం విస్తృతంగా పని చేశానని.. ఇప్పుడు తన చురుకైన పాత్రను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు బాధ్యతలు అప్పగించి, వారు పని చేసే అవకాశాన్ని కల్పించాలన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. ఇకపై తీవ్రమైన పాలనాపరమైన ఒత్తిళ్ల కంటే సామాజిక సంక్షేమం, గిరిజన ప్రాంతాలు, రైతుల శ్రేయస్సుపైనే దృష్టి సారిస్తానంటూ నితిన్ గడ్కరీ సంకేతాలు ఇచ్చారు.
మహారాష్ట్రలో ఏ గిరిజన గ్రామమూ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యాన్నీ గడ్కరీ ప్రస్తావించారు. ‘చేసినంత కాలం చేశాను.. ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి’ అని అన్నారు. గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీలో జరుగుతున్న తరాల మార్పుపై మరోసారి చర్చకు దారితీశాయి. ఇటీవల పార్టీ సంస్థాగత స్థాయిలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి
జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ