ట్రంప్ అల్లుడి కేరళ టూర్.. సీఎంతో భేటీ వార్తల్ని ఖండించిన సీఎంవో
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:32 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు మైఖేల్ బౌలోస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు.
కొచ్చి (కేరళ) ఆగస్టు 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు(టిఫనీ ట్రంప్ భర్త) మైఖేల్ బౌలోస్ శనివారం వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. మైఖేల్ బౌలోస్ శనివారం వ్యక్తిగత పర్యటన నిమిత్తం కొచ్చికి చేరుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ను వివాహం చేసుకున్న బౌలోస్తో పాటు, భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా వచ్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, బౌలోస్ తన పర్యటనలో కొచ్చి, సమీపంలోని అలప్పుజలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అయితే ఆయన పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదు.
మైఖేల్ బౌలోస్, కేవలం తన స్నేహితుడైన రాయబారి సెర్గియో గోర్ను కలవడానికి మాత్రమే భారత్కు వచ్చారని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది ఆయన భారత్లో పర్యటించడం ఇది రెండోసారి.

ముఖ్యమంత్రితో భేటీ వార్తలపై స్పష్టత: కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీషన్తో బౌలోస్ చర్చలు జరిపారంటూ వచ్చిన మీడియా వార్తలను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఖండించింది. సీఎం కేవలం అమెరికా రాయబారి సెర్గియో గోర్తో మాత్రమే అధికారికంగా భేటీ అయ్యారని, బౌలోస్తో ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బౌలోస్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, దానికి ఎలాంటి అధికారిక ప్రాధాన్యత లేదని అమెరికా ఎంబసీ ప్రతినిధి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ