మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ.. రాజ్యసభకు ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:57 AM
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
కోల్కతా, జూన్ 11: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న మరో ఎంపీ సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రోజు (గురువారం) ప్రకాశ్ చిక్ బరైక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ప్రకాశ్ రాజీనామాతో రాజ్యసభలో టీఎంసీ ఎంపీల బలం 10కి పడిపోయింది. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, వచ్చే వారం మరి కొంతమంది ఎంపీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ పార్టీని వీడటంతో సంక్షోభం మొదలైంది. టీఎంసీకి చెందిన 19 మంది ఎంపీలు తిరుగుబాటు చేసి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ బృందానికి టీఎంసీ సీనియర్ ఎంపీ కాకోలీ ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు.
దీదీకి అత్యంత విధేయంగా ఉన్న శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్, సయాని ఘోష్ కూడా తిరుగుబాటు బృందంతో చేతులు కలిపారు. దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు. సంక్షోభం కారణంగా మమతా బెనర్జీ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో టీఎంసీ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
పోలీస్ జాగిలాల నక నక.. నిధుల కొరతతో అందని పౌష్టికాహారం