సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యులు.. మహిళ ప్రాణం పోయింది..
ABN , Publish Date - Jun 30 , 2026 | 02:45 PM
ఇంటి దగ్గర సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యుల ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టింది. కాన్పు సందర్భంగా తీవ్ర రక్తంస్రావం అయి ఓ గర్భిణి చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కాన్పు విషయంలో కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటి దగ్గర సాధారణ కాన్పు చేయాలనుకున్న కుటుంబసభ్యుల ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టింది. కాన్పు సందర్భంగా తీవ్ర రక్తంస్రావం అయి ఓ గర్భిణి చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుప్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శశికళకు కొన్నేళ్ల క్రితం సిజేరియన్ కాన్పు అయింది. అయితే, ఆ సమయంలో పెద్ద మొత్తంలో అల్లోపతి మందులు తీసుకోవటంతో ఆమెకు అలర్జీ మొదలైంది.
ఆ అలర్జీ కారణంగా అల్లోపతి మందులు వేసుకోవటమే మానేసింది. తాజాగా, మరోసారి శశికళ గర్భం దాల్చింది. ఈ సారి సిజేరియన్ కాకుండా సాధారణ కాన్పు చేయాలని కుటుంబసభ్యులు భావించారు. కొద్దిరోజుల క్రితం శశికళకు నొప్పులు మొదలవ్వగా.. కుటుంబసభ్యులు ఇంట్లోనే కాన్పు చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం ఘోరంగా వికటించింది. అధిక రక్తస్రావం అవ్వటంతో శశికళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను పెరుందురైలోని గవర్నమెంట్ ఈరోడ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు ఆమెకు కాన్పు చేశారు. బిడ్డ క్షేమంగా బయటపడింది. అయితే, శశికళ మాత్రం అధిక రక్తస్రావం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం వెళ్లింది. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసులే స్వయంగా కేసు నమోదు చేశారు. శశికళ భర్త కొలందైసామిపై మర్డర్ కేసు నమోదు చేశారు. శశికళ మరణానికి దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరు చెబితే వారు ఇంట్లో కాన్పు చేయడానికి పూనుకున్నారు? సోషల్ మీడియాలో వీడియోలు చూసి అలా చేశారా? అన్న విషయాలపై దృష్టి సారించారు. ఇక, ఈ సంఘటనపై వైద్యశాఖ కూడా దర్యాప్తు చేపట్టింది.
ఇవి కూడా చదవండి
రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్..
మైక్రోసాఫ్ట్కు భారీ షాక్.. ఒక్క నెలలో రూ.49 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి..