విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:51 PM
తమిళనాడులో విద్యార్థుల నిరసనలపై జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాఠశాల, కళాశాల విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశాలను 24 గంటల్లోనే ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులు.. నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే వాటిని సవరించి ఉపసంహరించుకుంది.
గత వారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ.. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థుల అభిప్రాయాలు తప్పుగా ఉన్నప్పటికీ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిరసన తెలిపే హక్కు వారికి ఉందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి పి.. ఆగస్టు 17న శాఖ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు పంపించారు.
Also Read:
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం
10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి