Share News

‘ఈ-చలాన్‌’ మధ్యవర్తిత్వంపై సుప్రీం స్టే

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌ ఈ-చలాన్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఏపీ హైకోర్టు నియమించిన..

‘ఈ-చలాన్‌’ మధ్యవర్తిత్వంపై సుప్రీం స్టే

  • హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత.. ‘డేటా ఇవాల్వ్‌’ సంస్థకు నోటీసులు

  • రూ.37 కోట్ల నిధుల మళ్లింపుపై క్రిమినల్‌ కేసుంది: ఏపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌ ఈ-చలాన్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఏపీ హైకోర్టు నియమించిన ఆర్బిట్రేషన్‌(మధ్యవర్తిత్వ) ప్రక్రియపై ేస్ట విధించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘డేటా ఇవాల్వ్‌’(డిజీ యాత్ర డెవలపర్‌) సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ-చలాన్‌ నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయిని ఆర్బిట్రేటర్‌గా నియమిస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్రం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇది కేవలం సివిల్‌ వివాదం కాదు. ప్రజాధనాన్ని దారి మళ్లించిన భారీ కుంభకోణం. రూ.37 కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు సదరు సంస్థపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఒప్పంద గడువు ముగిశాక కూడా అనధికారికంగా సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తూ నిధులను దారి మళ్లించారు. క్రిమినల్‌ పరిధిలోకి వచ్చే అంశాల్లో ఆర్బిట్రేషన్‌ చెల్లదు. పైగా ఒప్పంద గడువు ముగిసినందున మధ్యవర్తిత్వానికి చట్టబద్థత ఉండదు’’ అని వివరించారు. సాఫ్ట్‌వేర్‌ సోర్స్‌ కోడ్‌నూ ప్రభుత్వానికి అప్పగించలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తదుపరి విచారణను మే 25వ తేదీకి వాయిదా వేసింది.


ఏపీ పోలీసు శాఖకు ఈ-చలాన్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను అందించి, నిర్వహించేందుకు 2018లో ‘డేటా ఇవాల్వ్‌’ సంస్థకు మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్‌ దక్కింది. ఈ ఒప్పందం గడువు 2021 డిసెంబరు 31తో ముగిసింది. తర్వాత కాంట్రాక్టును పునరుద్ధరించకున్నా సదరు సంస్థ అనధికారికంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తూ వచ్చిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ట్రాఫిక్‌ చలాన్ల రూపంలో వసూలైన సుమారు రూ.37 కోట్లను దారి మళ్లించిందని ఆరోపిస్తూ క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకే తాము రెవెన్యూ-షేరింగ్‌(ఆదాయ-పంపిణీ) పద్థతిలో ేసవలు కొనసాగించామని ఆ సంస్థ వాదించింది. బిల్లుల చెల్లింపులు, అకౌంట్స్‌ విషయంలో ప్రభుత్వంతో విభేదాలు వచ్చాయని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఏకసభ్య ఆర్బిట్రేటర్‌ను నియమించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 06:03 AM