బెంగాల్లో పోలింగ్ శాతం చూసి సంతోషించా
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:12 AM
కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు...
సర్పై పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్లో గురువారం జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ పోలింగ్ను నిర్వహించడం, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. భారత పౌరుడిగా బెంగాల్లో ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. సర్పై దాఖలైన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారించింది. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఎన్నికల విధుల్లో ఉన్న 65 మందితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై అప్పీలేట్ ట్రైబ్యునళ్లను సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. తాము విచారించబోమని స్పష్టం చేస్తూ పిటిషన్లను తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బెంగాల్లోని పశ్చిమమిడ్నాపూర్ జిల్లా ఉత్తర్బిల్-మాజ్పరా గ్రామంలో బూత్ నంబరు 238లో భారీగా పోలింగ్ నమోదైంది. 536 మంది ఓటర్లకు గాను 533 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 99.6 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News