దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..
ABN , Publish Date - Feb 08 , 2026 | 09:59 AM
రెవా - ప్రయాగ్రాజ్ హైవేపై బైక్ను ఆడీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముగ్గురూ పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
భోపాల్, ఫిబ్రవరి 8: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను ఆడీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముగ్గురూ పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రెవా జిల్లాలోని రతారా గ్రామానికి చెందిన భగవత్ విశ్వకర్మ పెద్ద కుమారుడికి పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 24వ తేదీన పెళ్లి వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు పెళ్లి పత్రికలు పంపిణీ చేస్తున్నారు. ఆదివారం భగవత్, అతడి చిన్న కొడుకు శివమ్, షీతల్ ( దగ్గరి బంధువు)లు బైకుపై పెళ్లి పత్రికలు పంచడానికి బయలు దేరారు.
రెవా - ప్రయాగ్రాజ్ హైవే మీద బైకుపై వెళ్తున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోస్ట గ్రామం సమీపంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఆడీ కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైకుతో సహా ముగ్గురూ గాల్లోకి లేచి దూరంగా ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. బైక్ను ఢీకొట్టిన తర్వాత కారు డివైడర్ను ఢీకొని ఆగిపోయింది. హైవేపై వెళ్తున్న వాహనదారులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని.. పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో రతారా గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన జరిగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి..
మానసిక ఒత్తిడి.. కండరాల నొప్పికి కారణమవుతుందా?
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్.. భయాందోళనలో ప్రజలు..