Share News

ఎర్ర షడ్భుజి ఉంటే.. చూసి తినాల్సిందే!

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:21 AM

ఏదైనా తినుబండారం ఉన్న ప్యాకెట్‌పై ఎర్ర రంగు త్రిభుజాకారం ఉంటే.. అందులో నాన్‌వెజ్‌ ఉందని అర్థమైపోతుంది. అదే ఆకుపచ్చ రంగు చుక్క ఉంటే.. శాకాహారం కింద లెక్క.

ఎర్ర షడ్భుజి ఉంటే.. చూసి తినాల్సిందే!

అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ఆహారపదార్థాలున్న

ప్యాకెట్లపై ముద్రించాలని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఏదైనా తినుబండారం ఉన్న ప్యాకెట్‌పై ఎర్ర రంగు త్రిభుజాకారం ఉంటే.. అందులో నాన్‌వెజ్‌ ఉందని అర్థమైపోతుంది. అదే ఆకుపచ్చ రంగు చుక్క ఉంటే.. శాకాహారం కింద లెక్క. ఇదే కోవలో.. ప్యాకేజ్డ్‌ ఆహారపదార్థాల్లో అధిక కొవ్వు, అధిక ఉప్పు, చక్కెర వంటివి ఉన్నాయని తెలిసేలా ఏదైనా గుర్తు ఉంటే? అధిక కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఉండే అనారోగ్యకరమైన ప్యాకేజ్డ్‌ ఆహారపదార్థాల వినియోగానికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఈ దిశగా ఒక ప్రతిపాదన చేసింది. అలాంటి ఆహారపదార్థాలున్న ప్యాకెట్ల ముందు భాగంలో ఎరుపు రంగులో ఉన్న షడ్భుజిని.. దాంట్లో ఆ ప్యాకెట్లోని తినుబండారంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఏది ఎక్కువగా ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా కనపడేలా ముద్రించాలని ప్రతిపాదించినట్టు పేర్కొంటూ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ సమర్పించింది. ఇదిలా ఉండగా, అనలాగ్‌ పనీర్‌పై దేశవ్యాప్తంగా త్వరలో నిషేధం విధించే అంశం పరిశీలనలో ఉందని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ సీఈవో రజిత్‌ పున్హానీ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనలాగ్‌ పనీర్‌పై నిషేధం విధించాయని గుర్తు చేశారు. అనలాగ్‌ పనీర్‌ను చీజ్‌ అనాలని గతంలోనే ఎఫ్‌ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:21 AM