Share News

అసత్యం, హింస.. మోదీ ప్రభుత్వ సూత్రాలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:21 AM

సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అహింసా మార్గంలో దీక్ష చేస్తున్న ఆయనను జంతర్‌ మంతర్‌ నుంచి తొలగించడం...

అసత్యం, హింస.. మోదీ ప్రభుత్వ సూత్రాలు

వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నంపై రాహుల్‌ ధ్వజం

విద్యార్థుల నిరసన ఢిల్లీ పీఠాన్ని

కదిలించడం ఖాయం: ఖర్గే

న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అహింసా మార్గంలో దీక్ష చేస్తున్న ఆయనను జంతర్‌ మంతర్‌ నుంచి తొలగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వానికి అబద్థం, హింస అనేవే ప్రధాన సూత్రాలుగా మారాయని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పెరిగిపోతున్న విద్యా వ్యయం, విద్యార్థుల ఆత్మహత్యలు.. ఇవన్నీ దేశ భవిష్యత్తుకు అత్యంత క్లిష్టమైన సమస్యలని.. ఏ రకమైన బలప్రయోగం కూడా దేశ విద్యార్థులను, వారిని ప్రేమిస్తున్న తమలాంటివారిని ఈ సమస్యలు లేవనెత్తకుండా అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇక.. వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నల్లటి మచ్చ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘విద్యార్థుల గర్జన’ దిల్లీ గడపలను తాకడం ఖాయం’’ అని ఖర్గే ‘ఎక్స్‌’ వేదికగా హెచ్చరించారు. మోదీ ప్ర భుత్వానికి పౌరుల ప్రాణాల పట్ల, వారి ఆరోగ్యంపట్ల కనీస విలువ లేదని శివసేన (యూబీటీ) అధినేత ఉద్థవ్‌ ఠాక్రే ధ్వజమెత్తారు. కేంద్రం వాంగ్‌చుక్‌ సహనాన్ని పరీక్షించకూడదని.. ఆయనతో తక్షణమే చర్చ లు జరపాలని అన్నా హజారే అన్నారు. ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతున్నారని.. ఆయన డిమాండ్‌కు ప్రభుత్వం ఔననో, కాదనో ఏదో ఒక సమాధానం చెప్పాలని సూచించారు. ఇక.. జంతర్‌మంతర్‌ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆప్‌ జాతీయ కన్వీర్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 19 , 2026 | 06:21 AM