సుప్రీంకు ఐదుగురు కొత్త జడ్జిలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:16 AM
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ముర్ము...
రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర
న్యూఢిల్లీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు బార్ నుంచి ఒక సీనియర్ మహిళా న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్తగా సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ శీల్ నాగు(పంజాబ్-హర్యానా హైకోర్టు), జస్టిస్ చంద్రశేఖర్(బాంబే హైకోర్టు), జస్టిస్ సంజీవ్ సచ్దేవా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అరుణ్ పల్లి(జమ్మూ కాశ్మీర్-లడఖ్ హైకోర్టు)లు ఉన్నారు. వీరితోపాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన నేరుగా బార్ కోటా నుంచి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు మోహన బాధ్యతలు చేపడితే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరనుంది. కాగా, కొత్తగా నియమితులైన ఈ ఐదుగురు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం