నిఫ్ట్ కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:04 PM
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కంబైన్డ్ కాన్వొకేషన్ 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు(సోమవారం) ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలో రాష్ట్రపతి పాల్గొని పట్టభద్రులకు డిగ్రీలను అందజేస్తారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) కంబైన్డ్ కాన్వొకేషన్ 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు (ఆగస్టు 31)న ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలో ఎన్ఐఎఫ్టీ అధికారిక విజిటర్గా ఆమె పాల్గొని పట్టభద్రులకు డిగ్రీలను అందజేస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న 18 ఎన్ఐఎఫ్టీ క్యాంపస్లకు చెందిన విద్యార్థులు ఈ సంయుక్త స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్తో పాటు పలువురు సీనియర్ అధికారులు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.
విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, కృషిని గుర్తించేందుకు ఈ కాన్వొకేషన్ నిర్వహిస్తున్నారు. ప్రతి క్యాంపస్ నుంచి అన్ని కోర్సుల్లో అత్యధిక సీజీపీఏ (CGPA) సాధించిన ఉత్తమ విద్యార్థులను గోల్డ్ మెడల్స్తో సత్కరిస్తారు. ఈ ఉమ్మడి వేడుక అనంతరం, ఆయా క్యాంపస్ల వారీగా డిగ్రీల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి.
ఫ్యాషన్ విద్యలో అగ్రగామి
1986లో కేంద్ర జౌళి శాఖ పరిధిలో ఏర్పాటైన ఎన్ఐఎఫ్టీ, 2006 ఎన్ఐఎఫ్టీ చట్టం ద్వారా చట్టబద్ధమైన సంస్థగా మారింది. సంప్రదాయ కళలు, ఆధునిక డిజైన్, సాంకేతికతను మిళితం చేస్తూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 క్యాంపస్లతో భారతదేశ ఫ్యాషన్ విద్యా రంగంలో అగ్రగామిగా నిలిచింది. 'వికసిత్ భారత్' సాధనలో ఈ యువ డిజైనర్లు కీలక పాత్ర పోషిస్తారని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని