భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
ABN , Publish Date - Aug 30 , 2026 | 09:38 AM
భిన్నత్వంలో ఏకత్వం అనే భావన భారత్, అమెరికాల డీఎన్ఏలో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్, అమెరికాల డీఎన్ఏలో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అమెరికా గురించి చెప్పేటప్పుడు సాధారణంగా బహుళత్వం గురించి మాట్లాడతారని మోహన్ భాగవత్ తెలిపారు. అయితే, భారత్ విషయంలో మాత్రం భిన్నత్వంలో ఏకత్వం గురించి చెబుతారని అన్నారు. ఈ ఏకత్వం, భిన్నత్వాలు రెండు దేశాల డీఎన్ఏలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ పేరిట జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
దేశాలంటే కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాదని మోహన్ భాగవత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి దేశానికి ఒక గమ్యం ఉందని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్ చాటిచెబుతోందని అన్నారు. భిన్నత్వాన్ని ఆమోదించడమే కాకుండా, గౌరవించి ఒక వేడుకలా జరుపుకోవాలని కూడా సూచించారు.
మనుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండవని ఆయన చెప్పారు. అన్ని ఆధ్యాత్మిక మార్గాల అంతిమ గమ్యం ఒకటేనని కూడా అన్నారు. భారత్లో ముస్లింలు ఎవరూ ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాడని అన్నారు. కర్మ భూమి, జన్మభూమి పట్ల ఉన్న బాధ్యతలను నిర్వర్తించాలని ఎన్నారైలకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
భార్యను చంపి, గుండెపోటుగా చిత్రీకరించిన భర్త.. సీసీటీవీ కెమెరాతో గుట్టురట్టు..
పెంపుడు కుక్క నోటికి ప్లాస్టర్ వేసి.. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకెళ్లిన దొంగలు..