పెంపుడు కుక్క నోటికి ప్లాస్టర్ వేసి.. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకెళ్లిన దొంగలు..
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:56 AM
బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగలు.. ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క అరవకుండా ఉండేందుకు దాని నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగలు.. ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క అరవకుండా ఉండేందుకు దాని నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. పోలీసులు, బాధితుడు అలోక్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం కొందరు దొంగలు భర్వర్ గ్రామంలోని అలోక్ సింగ్ ఇంట్లో దొంగతనాకి వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం పడుతుండటం, కూలర్ శబ్దం పెద్ద మొత్తంలో వస్తుండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ సమయంలో అలోక్ సింగ్, ఆయన భార్య విడివిడి గదుల్లో నిద్రిస్తున్నారు. పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు చుట్టాల ఇంటికి వెళ్లారు. నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగలు ఇంటి ప్రాంగణంలో కట్టేసి ఉన్న పెంపుడు కుక్క నోటికి ప్లాస్టర్ వేసి సైలెంట్ చేశారు.
అనంతరం రెండు గోద్రెజ్ అల్మారాలు, రెండు ఇనుప పెట్టెలను పగలగొట్టి వాటిలో దాచిన సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో పాటు 40,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఉండటంతో అలోక్ దంపతులు షాక్కు గురయ్యారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఇంట్లో ఈ తరహా చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక, సమాచారం అందుకున్న ముఫాసిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి
రోడ్డు ప్రమాదాల కేసుల్లో 21 రోజుల్లో మరణాల నమోదు