మా ప్రాణాలు ముఖ్యం కాదా..!?
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:35 AM
గవర్నర్ కాన్వాయ్ వస్తుందంటూ అరగంటపాటు ట్రాఫిక్ నిలిపివేయడంతో.. గర్భవతిగా ఉన్న భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ సామాన్యుడి కడుపు మండింది...
గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత..
కాన్వాయ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించిన గర్భిణి భర్త
భార్య చికిత్సకు ఆలస్యం అవుతుందని ఆవేదన
బెంగళూరు, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కాన్వాయ్ వస్తుందంటూ అరగంటపాటు ట్రాఫిక్ నిలిపివేయడంతో.. గర్భవతిగా ఉన్న భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ సామాన్యుడి కడుపు మండింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం బెంగళూరు పోలీసులు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ కాన్వాయ్ కోసం లోక్భవన్ నుంచి ఓల్డ్ ఎయిర్పోర్ట్ (హెచ్ఏఎల్)కు వెళ్లే మార్గంలో 30 నిమిషాల పాటు వాహనాలను ఆపేశారు. విసుగు చెందిన గర్భిణి భర్త.. కారు దిగొచ్చి రోడ్డుపై బైఠాయించారు. తన భార్య గర్భిణి అని అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలని పోలీసులకు తెలిపారు. గవర్నర్ విమానాశ్రయం దాటకముందే ట్రాఫిక్ ఎందుకు ఆపేశారని, వీఐపీలకిచ్చే ప్రాధాన్యత సామాన్య పౌరులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు ఆయనకు నచ్చచెప్పి పక్కకు తీసుకెళ్లారు. కాసేపటికి గవర్నర్ కాన్వాయ్ రావడంతో వాహనాలు ముందుకు కదిలాయి.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం