Share News

ప్రధాని మోదీతో నితీశ్ కుమార్ భేటీ.. బాంకీపూర్ ఓటమిపై చర్చ..!

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:15 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఇవాళ (మంగళవారం) మోదీ, నితీశ్ సమావేశమయ్యారు.

ప్రధాని మోదీతో నితీశ్ కుమార్ భేటీ.. బాంకీపూర్ ఓటమిపై చర్చ..!
PM Modi Meets Nitish Kumar

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఇవాళ (మంగళవారం) మోదీ, నితీశ్ సమావేశమయ్యారు. బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓటమి పాలైన తర్వాత మోదీని జేడీయూ అధినేత నితీశ్ తొలిసారిగా కలిశారు. దీంతో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది.


ఈ సమావేశంలో బాంకీపూర్ సీటు కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, ఎన్డీయే తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నితీశ్‌తో పాటు జేడీయూ నాయకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ కుమార్ ఝా పాల్గొన్నారు. మరోవైపు, వీరి భేటీకి సంబంధించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అయితే, ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


కాగా, బీజేపీ కంచుకోటగా ఉన్న బాంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కైవసం చేసుకున్నారు. నిన్న (సోమవారం) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌ సిన్హాను ఆయన 19,324 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. నీరజ్ కుమార్‌కు 44,827 ఓట్లు వచ్చాయి. బాంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబీన్.. రాజ్యసభకు ఎన్నిక, బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో బాంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ విజయ బావుటా ఎగరవేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

అస్సాం సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం.. సహచరులపై కాల్పులకు దిగిన జవాన్

Updated Date - Aug 04 , 2026 | 05:37 PM