ప్రమాదంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:28 AM
ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ (సమగ్ర, ప్రత్యేక సవరణ) ప్రక్రియ అమలు తీరుతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తికి 24 విపక్ష పార్టీలు...
‘సర్’తో దేశంలో ఆందోళనకర పరిస్థితులు
ఆ ప్రక్రియ నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వండి
భారత ప్రధాన న్యాయమూర్తికి విపక్షాల లేఖ
న్యూఢిల్లీ, జూలై 3: ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ (సమగ్ర, ప్రత్యేక సవరణ) ప్రక్రియ అమలు తీరుతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తికి 24 విపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ లేఖ రాశారు. ‘సర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిలిపి వేయించండి. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఐదేళ్ల ముందు రాష్ట్రాల స్థాయిలో ఈ ప్రక్రియను చేపడితే సరిపోతుంది’’ అని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘సర్’తో పాటు ఎన్నికల సంబంధంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఏకరవు పెట్టారు. ఆ లేఖలోని అంశాలను ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్ తమ ‘ఎక్స్’ ఖాతాల్లో పంచుకున్నారు. ‘‘కార్యనిర్వాహక వర్గం పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం న్యాయవ్యవస్థకు ఉన్న రాజ్యాంగ బాధ్యత. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడటంలో సుప్రీంకోర్టుకూ కీలక పాత్ర ఉంది’’ అని ఆ లేఖలో తెలిపారు. కాగా, ప్రజాస్వామ్యం వన్నెను మసకబార్చడానికి విపక్షాలు ప్రమాదకరమైన కుట్రను రచించాయని బీజేపీ ధ్వజమెత్తింది. ‘సర్’, ఇతర ఎన్నికల సంబంధ అంశాలను ప్రస్తావిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి విపక్షాలు లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. దేశాన్ని అరాచకంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్-మచిలీపట్నం మధ్య సబ్మెరైన్ కేబుల్
For More Business News And Telugu News