మోదీ ప్రసంగానికి ముందే లోక్సభ వాయిదా..
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:44 PM
విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ గురువారానికి వాయిదా పడింది. దీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా గురువారానికి వాయిదా పడింది.
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్సభ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోక్సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగానికి ముందే సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.
మూడుసార్లు వాయిదా
బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభ బుధవారం నాడు మూడుసార్లు వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభం కాగానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్సభ వాయిదా పడింది. దీంతో విపక్ష సభ్యులు పార్లమెంటు మెట్ల వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలో సమాధానం ఇస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గెయల్ చెప్పడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా.. 8 మంది ఎంపీలను సమావేశాల నుంచి బహిష్కరించడంపై స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా విపక్ష సభ్యలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటలకు సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమై మోదీ ప్రసంగించాల్సి ఉండగా దీనికి ముందే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..
మణిపూర్లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..